17-06-2025 01:13:49 AM
- టీచింగ్ పోస్టుల భర్తీ, ప్రమోషన్లపై దృష్టి సారించాలి..
- కాలేజీలకు అనుసంధాన దవాఖానల్లో వసతులు కల్పించాలి..
- కమిటీ వాటిపై నివేదిక రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి..
- వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 వైద్య కళాశాలల్లో వసతుల కల్పన, పర్యవేక్షణకు తక్షణం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతి వైద్య కళాశాలను సందర్శిస్తుందని, ఏయే కళాశాలల్లో ఎలాంటి వసతులు కల్పించాలి.. ఆయా పనులకు ఎంత మేర నిధులు కావాలి.. పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం అందించాలనే అంశాలపై అధ్యయనం చేసి, కమిటీ సర్కార్కు నివేదిక సమర్పిస్తుందని సీఎం స్ఫష్టం చేశారు. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) రాష్ట్రవ్యాప్తంగా 26 వైద్యకళాశాలల్లో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
వసతుల లేమిపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈ ఈనెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని, అలాగే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా వర్చువల్గా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సోమవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్టీచింగ్ పోస్టుల భర్తీ, బోధనా సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపు, దవాఖానలకు అవసరమైన వైద్య పరికరాల సరఫరా తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షణలో మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని వైద్యకళాశాలల్లో వసతులు కల్పిస్తామన్నారు.
కేంద్ర వైద్యారోగ్యశాఖ నుంచి వచ్చే నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాము వాటిపై కేంద్ర మంత్రి నడ్డాతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జపనీస్ భాషను ఆప్షనల్గా నేర్పించాలని, జపాన్లో నర్సింగ్ సిబ్బందికి భారీ డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రం నుంచి నర్సింగ్ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.
వైద్యారోగ్యశాఖ అధికారులు ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారికి చికిత్స అందించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. విద్యా, వైద్య రంగాలు ఎంతో కీలకమైన శాఖలని, వాటిపై ప్రతి నెలా మూడో వారంలో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
అనంతరం ఎన్ఎంసీ నుంచి రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు వచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు సీఎం పలువురు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నరేందర్కుమార్ పాల్గొన్నారు.