19-06-2025 10:16:53 PM
ఆజ్యం పోస్తున్న స్థానిక రాజ 'కీయం’
పాఠశాల ప్రారంభం నుంచే ఇదే తంతు
వంట మాస్టర్లుగా అవతారమెత్తిన ఉపాధ్యాయులు, తల్లులు..
పెన్ పహాడ్: పేద విద్యార్థులు కడుపునిండా నాణ్యమైన భోజనం అందించి ఆకలి తీర్చాలని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మధ్యాహ్న భోజన పథకం సంఘబంధాల మధ్య చిచ్చు పిల్లలకు శాపంగా మారింది. ఇందుకు స్థానిక రాజ 'కీయం' ఆజ్యం పోయగా పాఠశాల ప్రారంభం నుంచే పాఠశాలలో ఇరువర్గ మహిళా సంఘాల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ లొల్లి సిగ పట్లకు దారి తీయనుంది. ఈ ఘర్షణ వాతావరణం పిల్లలు చదువుకు ఆటంకం కలుగుతుండగా ఉపాధ్యాయులు మాత్రం బోధనకు ఇబ్బందులు పడుతూ, మధ్యాహ్న భోజనం ఏర్పాటులో తలమునకలవుతున్నారు. ఈ సంఘటన మండలంలోని ధర్మాపురం (యూపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది.
గతంలో గ్రామములో సమభావన సంఘాల నడుమ నూతన సంఘబంధం ఎన్నిక ఏర్పాటులో వివాదం జరిగింది. నూతన సంఘబంధం ఏర్పాటుకు తీర్మాణం లేకుండా ఎలా జరుగుతుందని పాత సంఘబంధం సభ్యులు ఆరోపిస్తూ పూర్తి విచారణ చేసి ఎన్నికలు జరిపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్(District Collector Tejas Nandalal Pawar)కు వినతి పత్రం అందజేశారు. అప్పటి నుంచి గ్రామములో వివాదాలకు దారి తీసింది. కాగా పాఠశాల ప్రారంభం నుంచే మేమంటే మేము (కొత్త, పాత) సంఘబంధాలమని మేము చెప్పిన వారే మధ్యాహ్న భోజనం వంటలు చేయాలని పోటా పోటీగా ముందుకు రావడంతో వివాదం కాస్తా లొల్లికి దారి తీసింది.
మధ్యాహ్న భోజనం వంటగదికి తాళం వేసి ఘర్షణ వాతావరణంకు తెర లేపారు. వారం రోజులుగా రెండు వర్గాల మధ్య సమస్య తలెత్తడంతో స్థానిక హెచ్ఎం రామినేని శ్రీనివాస్ చొరవ తీసుకొని 'మీ మద్య సమస్య పరిస్కారం అయ్యే వరకు తామే వంటలు వండి పిల్లలకు అందిస్తామని తెలిపిన ఎచ్ఎం పిల్లల తల్లుల సహాకారంతో మధ్యాహ్న భోజనం పిల్లలకు అందిస్తున్నారు. పిల్లల కోసం ఉపాధ్యాయులు, పిల్లల తల్లులు వంట మాస్టర్లుగా అవతారం ఎత్తారు. పలు సార్లు ఈ విషయం పై పలువురికి విన్నవించినా పట్టింపు లేకపోలేదు. ఈ వివాదంపై ఎంఈఓ నకిరెకంటి రవికి హెచ్ఎం ఫిర్యాధు చేసినట్లు తెలిసింది. ఏదీ ఏమయినా సంఘాల నడుమ వివాదం లేకుండా స్థానిక నాయకులు, సెర్ఫ్, విద్యాశాఖ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.