19-06-2025 10:23:49 PM
వాంగ్మూలాన్ని సేకరించిన సీట్ అధికారులు...
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో చెన్నూరు నియోజకవర్గం(Chennur Constituency)కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్ష్యులుగా తమ వాంగ్మూలాన్ని విచారణ నిర్వహిస్తున్న సిట్ అధికారులకు అందజేశారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన విచారణకు వారు హాజరై, సాక్ష్యులుగా తమ వాంగ్మూలాన్ని సిట్ అధికారులకు అందజేశారు. విచారణకు హాజరైన వారిలో జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తవక్కల్ విద్య సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్, మందమర్రి పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు ఎండి ముజాహిద్ లు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ తో పాటు గత ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని వివరించారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ వెంకటస్వామికి మద్దతు తెలిపినందుకు తమపై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు వారు అభిప్రాయపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలను వద్దనుకొని, విద్యావంతుడు, సౌమ్యడైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం వివేక్ కి మద్దతు ఇచ్చినందుకు, తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తమ ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు పోలీసులతో తమను బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తమ ఫోన్ ట్యాపింగ్ గురైందని సిట్ అధికారులు తమకు తెలిపే దాకా తమకు తెలియలేదని విస్మయం వ్యక్తం చేశారు.
స్టేట్ హోం సెక్రెటరీ నుండి తీసుకున్న అనుమతికి మించి సుమారు ఆరు నెలల పాటు తమ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వలన తమకు రాజ్యాంగం వల్ల తమకు లభించిన స్వేచ్ఛకు భంగం కలిగిందని ఆరోపించారు. ఆ సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామికి మద్దతు ఇస్తున్నామని, రాజకీయాలు తప్పుకోవాలని బెదిరింపులకు ప్రయత్నించారని, చట్ట విరుద్ధంగా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. అదేవిధంగా తమను అనేక రకాల ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారన్నారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి, ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన అధికారులు, గత ప్రభుత్వ నాయకులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.