04-02-2026 12:50:17 AM
కాళేశ్వరం, ఫిబ్రవరి 03 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తుల సమస్యలను సులభంగా తెలియజేయడానికి ఫిర్యాదుల బాక్స్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సరిత ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని సమస్యలను మౌఖికంగా చెప్పడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు తమ సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు బాక్సులో వేయవచ్చని సర్పంచ్ సరిత తెలిపారు.
ప్రతి సోమవారం ఫిర్యాదు బాక్స్ను తెరిచి, అందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలను సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా, నేరుగా గ్రామపంచాయతీ ఫిర్యాదు బాక్స్ ద్వారా తెలియజేస్తే త్వరితగతిన పరిష్కారం సాధ్యమవుతుందని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, గ్రామ కార్యదర్శి స్వాతి, వార్డు సభ్యులు శ్రీజతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.