దొడ్ల రాములు వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
పెబ్బేరు ఏప్రిల్ 5: గొల్లపల్లి, చీరకపల్లి రిజర్వాయర్కు సంబంధించిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకుడు దొడ్ల రాములు (చిరుకపల్లి గ్రామ నివాసి) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డిల పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది.ఈ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై, వాటిని ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెబ్బేరు పోలీస్ స్టేషన్లో యూత్ కాంగ్రెస్ నాయకులు పిటిషన్ సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా దూషణలు చేయడం, అసభ్య పదజాలంతో మాట్లాడడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు సాయి రెడ్డి, పెబ్బేరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సుగూరు శివ, మణిదీప్ గౌడ్, శివ, షకీల్, అరవింద్, అఖిల్, నజీర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




