12-06-2025 12:00:00 AM
ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనాను తొలగించి, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా పుంజుకున్నాయి. హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా, పొరుగున వున్న భారత్కు వ్యతిరేకంగా యూనుస్ నాయకత్వంలో కొత్త సమీకరణలతో ముందుకెళ్లాలనుకున్న పార్టీల కలలు కల్లలయ్యాయి.
ఐదేళ్లు ఇలాగే కొనసాగాలనుకున్న యూనుస్కు, డిసెంబర్ కల్లా దేశంలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల ని సైన్యం చేసిన హెచ్చరిక మింగుడు పడలేదు. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించాల్సి వచ్చింది. జమాత్ ఇస్లామీ డిమాండ్ మేరకు హసీనాను పదవీచ్యుతురాలిని చేసినప్పటికీ, హసీ నా నాయకత్వంలోని అవామీ లీగ్, మిగతా పార్టీల మనుగడకు పెద్ద సవాలుగా పరిణమించింది.
యూనుస్ ప్రభుత్వానికి ఇప్పుడు.. దేశంలో విద్యార్థుల ఆందోళనలతో పుట్టుకొచ్చిన నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ), జమాతీ ఇస్లామీ పార్టీ మద్దతు మాత్రమే ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), వామపక్షాలతో సహా దాదాపు 25 పార్టీలు డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ను యూనుస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇక, అనుకున్నట్లు వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే, అవామీ లీగ్ను ఎదుర్కోగలమా అనేది ఈ పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. హసీనాను పదవీ చ్యుతురాలిని చేయడంతో దేశంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
యూనుస్కు మద్దతునిస్తున్న రెండు పార్టీలకు ప్రజల్లో ఉన్న మద్దతు నామమాత్రమే. జనరల్ జియా ఉల్ రహ్మాన్ స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఇప్పుడు ఆయన కుమారుడు తారిఖ్ రహ్మాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇంగ్లండ్లో ప్రవాస జీవితం గడుపుతున్న తారీఖ్తో యూను స్ రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యూనుస్ను బీఎన్పీ నాయకత్వం విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు.
దేశంలో సంస్కరణలు పూర్తయ్యే వరకు ఐదేళ్లు యూనుస్ ప్రభుత్వమే కొనసాగాలని జమాత్, ఎన్సీపీలు ప్రకటనలు చేయడం బీఎన్పీకి నచ్చలేదు. మరోవైపు, వైద్యం కోసం గుట్టు చప్పుడు కాకుండా కొన్ని వారాల క్రితం లుంగీమీదనే విమానాశ్రయానికి వెళ్లి బాంకాక్లో దిగిన మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ సోమవారం అంతే రహస్యంగా తిరిగి వచ్చారు. హమీద్ అవామీ లీగ్ మద్దతుదారుడనేది అందరికీ తెలుసు.
ప్రత్యర్థుల కదలికలపై కన్నేసి వుంచిన యూనుస్ ప్రభుత్వానికి హమీద్ దేశం విడిచి వెళ్లడం, తిరిగి రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇప్పుడు హమీద్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది అవామీ లీగ్కు కలిసి వస్తుందని, ఆ పార్టీ పాప్యులారిటీ మరింత పెరుగుతుందని యూనుస్ ప్రభుత్వం భయపడుతున్నది. షేక్ హసీనా అక్రమాలపై విచరణ జరిపించే అంశం కూడా ఇలాంటిదే.
ఆ విచారణ వల్ల ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఈ పరిస్థితుల్లో అది శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తున్నది. దేశ స్వరూపాన్నే మార్చివేస్తామని చెప్పుకున్న యూనుస్ ప్రభుత్వం ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితులను తెచ్చింది.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగంతో బంగ్లాదేశ్ గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. పశ్చిమ దేశాల డిమాండ్లకు తలూపుతూ, భారత్ను దూరం చేసుకొనే విధానాలతో దేశంలో వచ్చేది దుర్దినాలేనని మెజారిటీ బంగ్లాదేశీయులు ఆందోళన చెందుతున్నారు.