21-11-2025 07:13:01 PM
నకిరేకల్,(విజయక్రాంతి): కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్కటై బిఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శుక్రవారం స్థానిక సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీపై విశ్వాసం తగ్గలేదన్న నిజాన్ని తెలుసుకున్న కాంగ్రెస్, బిజెపిలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఏ మాత్రం తగ్గకపోవడంతో రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదన్నారు.
రేవంత్ అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మందిని బెదిరింపులకు గురిచేసినా జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారు. కేటీఆర్ ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ఫార్ములా రేస్ కేసును మళ్ళీ తెరపైకితెచ్చారన్నారు. రేవంత్ రెడ్డి అనుకున్నదే తడవుగా మోడీ అనుమతితో గవర్నర్ విచారణకు అనుమతించారు. రాష్ట్రంలో బిజెపికి భవిష్యత్తు లేదని తెలిసి కాంగ్రెస్ తో కలిసి కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ ఫార్ములా రేస్ కేసులో ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలుసునని, ఈ ఫార్ములా తోనే రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
ఇలాంటి కేసులు బిఆర్ఎస్, కేసిఆర్, కేటీఆర్ కు కొత్త కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేట్ వ్యక్తులతో పాలన నడిపిస్తున్నాడన్నారు. మంత్రుల భార్యలకు కాదు మంత్రులే చీరలు కట్టుకునేలా ఉన్నారని సీఎం మీడియా ముఖంగా పరువు తీసిన సిగ్గులేకుండా మంత్రులు నవ్వుతున్న దుస్థితి ఉందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని పేర్కొన్నారు. కేటీఆర్ పై ఈ ఫార్ములా పేరుతో విచారణను తీవ్రంగాఖండిస్తున్నామన్నారు.తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. లేకుంటే ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.