14-02-2026 01:31:58 AM
మూడు సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్
పుంజుకున్న బీజేపీ
కల్వకుర్తి ఫిబ్రవరి 13: కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 22 వార్డుల్లో 13 స్థానాలు కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఏడుసీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి తన ప్రాభవాన్ని పెంచుకుంది.గత ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ఈసారి కేవలం మూడు సీట్లకే పరిమితమైంది.
భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో నుంచి ఐదు స్థానాలకు ఎగబాకి పట్టణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంది. స్వతంత్ర అభ్యర్థులు గత ఎన్నికల్లో నలుగురు గెలవగా, ఈసారి ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.దీంతో కల్వకుర్తి మున్సిపల్ పాలకవర్గంపై కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందిన అభ్యర్థులతో కలిసి పట్టణంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఒక్క ఓటుతో కాంగ్రెస్ విజయం
పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాజ్, బీఆర్ఎస్ అభ్యర్థి తాయారుఅలీపై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించడం ఉత్కంఠ రేపింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన పోటీలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించింది.
మూడోసారి విజయం
కల్వకుర్తి మున్సిపల్ ఏర్పాటైన నాటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో మహమ్మద్ షాయద్ మూడోసారి విజయాన్ని నమోదు చేశారు.నాలుగో వార్డులో ఓటమి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అభ్యర్థి సుశీల, కౌంటింగ్ కేంద్రం వద్ద అస్వస్థతకు గురయ్యారు. విజయోత్సవ ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.