28 March, 2026 | 12:23 AM

మూగబోయిన పేదల పెన్నిధి గరీబోళ్ల కిరణం

27-03-2026 10:38 PM

కాంగ్రెస్ నాయకుడు కన్నేరాజు కన్నుమూత

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం పోరాడిన ధీశాలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గరీబోళ్ల నాయకుడు, కన్నేరాజు  తుదిశ్వాస విడిచారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని కార్మిక నగర్ లోని తన స్వగృహంలో ఆయన మృతి చెందడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పేదల కోసం అలుపెరగని పోరాటం 

చేసిన దీశాలి  కేవలం నాయకుడిగానే కాకుండా, పేదల పక్షపాతిగా చిరస్మరణీయమైన సేవలు అందించారు. ముఖ్యంగా  ఇళ్ల స్థలాల సాధన సుమారు 1500 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిది.  కార్మిక బంధువు కార్మిక నగర్ ఏర్పాటులో  అక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయనది కీలకపాత్ర. కన్నేరాజు  మరణం పట్ల జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపూల శ్రీకాంత్ యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "కన్నేరాజు మరణం కాంగ్రెస్ పార్టీకి  జవహర్ నగర్ ప్రజలకు తీరని లోటు 1500 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప నాయకుడు ఆయన. పేదల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుంటుంది."అని శ్రీకాంత్ యాదవ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జవహర్ నగర్ కాంగ్రెస్ తమ సీనియర్ నాయకుని మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది.తన నాయకుడిని కోల్పోవడంతో కార్మిక నగర్ వాసులు శోకసముద్రంలో మునిగిపోయారు. కన్నేరాజు  భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు భారీగా అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివస్తున్నారు.