14-05-2025 12:00:00 AM
ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు
కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి) : అధికారులు ఇళ్ళిళ్ళు తిరిగి సర్వే చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి గ్రామపంచాయతీ బోర్డుపై లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన తర్వాత ఇందిరమ్మ కమిటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులోని పేర్లను తొలగించి పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగిందని దోమకొండ మండల కేంద్రంలోని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ వచ్చి పేదలకు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించింది. మొదటి విడతలో అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని గుర్తించి వారికి ఇండ్లను ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్న స్థానిక రాజకీయ నాయకులు మాత్రం వారికి నచ్చిన వారికి ఇండ్లను కేటాయిస్తూ అసలైన అరులకు మొండి చేయి చూపెడుతున్నారు.
ఇదేమిటి అని ప్రశ్నిస్తే మా ఇష్టం ఉన్నవారికి ఇచ్చుకుంటాం అధికారులు చెప్పింది కాదు మేము చెప్పిందే చట్టం అంటూ లబ్ధిదారులను సైతం బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీలో కార్యదర్శి నోటీస్ బోర్డు మీద గ్రామంలోని కొందరు పేర్లను ప్రకటించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి వారికి సంబంధించిన కార్యకర్తల వాళ్ల పేర్లు మెన్ష న్ చేసుకున్నారు. అర్హులైన నిరుపేదలైన అభ్యర్థులకు మొండి చేయి చూపిస్తూ వారు అనుకున్న వారికి మాత్రమే ఇళ్లను కేటాయిస్తున్నాని పలువురు పేర్కొంటున్నారు.
కలెక్టర్ దృష్టి సారించాలి..
ప్రస్తుతం కామారెడ్డి కలెక్టర్ దోమకొండ మండల కేంద్రంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అధికారులను విచారించి ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లను కేటాయించాలని పలువురు ఇందిరమ్మ ఇండ్లు లిస్టులో పేరు వచ్చి పోయిన వారు కోరుతున్నారు.