calender_icon.png 30 May, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర!

30-05-2025 01:35:33 AM

నన్ను పార్టీ నుంచి పంపేంత సీన్ లేదు

  1. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే నన్ను ఓడించారు
  2. మీడియా ఇష్టాగోష్టిలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
  3. కేసీఆరే నా నాయకుడు
  4. పార్టీలో మరెవరి  నాయకత్వాన్ని అంగీకరించను
  5. లెటర్ లీకు వీరుల్ని  పట్టుకోమంటే గ్రీకు వీరుల్లా దాడి చేస్తున్నారు
  6. కేసీఆర్‌కు నోటీసులివ్వడంపై ట్వీట్లు చేస్తే సరిపోతుందా?..  నిరసనలు తెలపరా?
  7. కేసీఆర్‌ను నడిపించేంటంత పెద్దోళ్లా మీరు?

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీని గంపగుత్తగా బీజేపీలో విలీనంచేసే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకి వెళ్లే సమయంలో ఈ ప్రతిపాదన వస్తే వద్దని చెప్పానని అన్నారు. బీఆర్‌ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, ఇంకెవరి నాయకత్వాన్ని తను అంగీకరించే ప్రసక్తి లేదని కవిత స్పష్టంచేశారు.

వెన్నుపోటు పొడవడం తనకు రాదని, తాను నేరుగానే పోరాడుతానని అన్నారు. తనపై విమర్శలు చేసే వారు మొదట తాను పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో, ఎవరు లీక్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీతో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని కవిత చెప్పారు. ఇటీవల కేసీఆర్‌కు తాను రాసిన లేఖ బహిర్గతం కావడం, ఆ తర్వాత కవిత కామెంట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన నేపథ్యంలో కవిత గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె అనేక సంచలన కామెంట్లు చేశారు. తాను రాసిన లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోమంటే, గ్రీకు వీరుల్లా దండెత్తుతున్నారని కవిత మండిపడ్డారు. నా తండ్రికి వంద లేఖలు రాసుకుంటాను, మీకు వచ్చిన నొప్పేంది అని ఆమె ప్రశ్నించారు. సాధారణంగా కేసీఆర్ లేఖ చదవగానే చింపు తారని, ఈ సారి మాత్రం లేఖను చింపలేదని కవిత చెప్పారు. బీఆర్‌ఎస్ చేయా ల్సిన పనులను తెలంగాణ జాగృతి తరఫున తాను నిర్వహించానని అన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పినా, వారిని ఎందుకు పక్కన పెట్టడం లేదని కవిత ప్రశ్నించారు.

తనను కేసీఆర్‌కు దూరం చేసే కుట్ర జరుగుతోందని, తాను పార్టీకి ప్రత్యక్షంగా దూరమైతే ఎవరికి లాభమో అందరికీ తెలుసని కవిత అన్నారు. ఎంపీ దామోదర్‌రావు, గండ్ర మోహన్‌రావులను ఎవరు పంపారో తనకు తెలియదని, అయితే వారు ఎవరికి దగ్గరో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారని, ఇంటి ఆడబిడ్డ అని కూడా చూడకుండా దేశం బయటి సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. సెల్‌ఫోన్లు పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు.

తను అసలే మంచిదాన్ని కాదనీ, తను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. తనపై ఏడ్చే బదులు ఈ తెలితేటలేవో ఇతర పార్టీలపై చూపించాలని కవిత ఎద్దేవా చేశారు. తనకు నీతులు చెప్తున్న వారంతా తెలంగాణలో నీళ్ల వివాదంపై మాట్లాడితే బాగుం టుందని హితవు పలికారు. సమస్యలపై ట్వీట్లు కావని క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని కవిత ఒకింత ఘాటుగా విమర్శలు చేశారు. కేసీఆర్‌ను తామే నడిపిస్తున్నామని ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను నడిపించేటంతా పెద్దొళ్లా మీరు అని కవిత విమర్శించారు.

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీలో ఎందుకు నిరసనలు తెలుపలేదని కవిత అన్నారు. ఆ నోటీసులపై ఎక్స్‌లో కామెంట్స్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. అదే మరో నేతకు నోటీసులు అందితే అప్పటికప్పుడు హంగామా చేశారని కవిత ఆరోపించారు. తాను హుందాగా రాజకీయాలు చేస్తానే తప్ప వారి లాగా చిచోర పాలిటిక్స్ చేయబోనని అన్నారు. కడుపులో విషం పెట్టకొని బయటకు నవ్వుతూ ఉండే తత్వం తనది కాదన్నారు. కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశానని చెప్పారు.

కొందరు కేసీఆర్ నీడలో ఉన్నారు తప్ప ఉద్యమం ఏం చేశారని కవిత ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్, గౌరవం ఉంటుందని తెలిపారు. తనను పార్టీ నుంచి పంపించేంత సీన్ లేదని కవిత స్పష్టం చేశారు. ఇతర పార్టీలపై విరుచుకుపడాల్సింది పోయి నాపై పడి ఏడిస్తే ఏమొస్తుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను నిజమాబాద్‌లో సొంత పార్టీ నేతలే ఓడించారని ఆరోపించారు. తనకు అదే జిల్లాలోప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు.

తనను సొంత పార్టీ సోషల్ మీడియానే టార్గెట్ చేస్తుంటే, ఆ తప్పుడు వార్తలను ఎందుకు ఖండించలేదని ఆమె ప్రశ్నించారు. తాను పార్టీ ఎందుకు పెడతానని, ఉన్న పార్టీని బాగు చేసుకుంటే చాలన్నారు. లోక్‌సభలో ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలే కానీ, ఎక్స్‌లో పోస్టులకే పరిమితం అవుతారా అని ఆమె ప్రశ్నించారు.  కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.