30-05-2025 02:43:44 AM
వాషింగ్టన్ డీసీ, మే 29: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) శాఖ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు మస్క్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని మస్క్ పేర్కొన్నారు.
ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ట్రంప్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ ప్రముఖ పాత్ర పోషించారు. భారీగా నిధులు సమకూర్చడంతో పాటు ప్రచార బాధ్యతలను పర్యవేక్షించారు.
దీంతో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మస్క్కు ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిన డిపార్టహెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) శాఖ బాధ్యతలను ఆయనకు అందించారు. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టడంతో పాటు వృథా ఖర్చులకు కత్తెర వేయడం ద్వారా ప్రభుత్వానికి భారీగా నిధులు మిగిల్చారు.
అయితే ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండటం వల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు గండి కొడుతుందన్నారు. ఈ నిర్ణయంతో డోజ్ తీసుకున్న చర్యలు వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం గమనార్హం.