calender_icon.png 31 May, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధాలేవీ?

30-05-2025 01:28:45 AM

  1. సంతకాలే తప్ప రక్షణరంగ ప్రాజెక్టులు పూర్తవ్వడం లేదు
  2. కొనుగోళ్ల జాప్యంపై వైమానిక దళాధిపతి ఆందోళన
  3. సమస్యగా మారిన కాలపరిమితి.. అనవసర వాగ్దానాలెందుకు?
  4. తేజస్ యుద్ధ విమానాలు ఒక్కటి కూడా చేతికి రాలేదు: అమర్ ప్రీత్ సింగ్ 

న్యూఢిల్లీ, మే 29: దేశ రక్షణ రంగానికి సంబంధించి కొత్త కాంట్రాక్టులపై సంతకాలైతే జరుగుతున్నాయి కానీ, సకాలంలో ఆ రక్షణ రంగ ప్రాజెక్టులు పూర్తవ్వడంలేదని దేశ వైమానిక దళాధిపతి  ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. కాలపరిమితే సమస్యగా మారినప్పుడు ప్రాజెక్టులు పూర్తిచేస్తామని అనవసర వాగ్దానాలు చేయడమెందుకని పేర్కొన్నారు.

గురువారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలోనే ఎయిర్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధ రంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాల్సిన అవసర ముందని అమర్ ప్రీత్ అభిప్రాయపడ్డారు. దళాలను శక్తిమంతం చేస్తేనే యుద్ధాలు గెలవగలమని ఆయన అన్నా రు. ఇందుకు సైనిక దళాలకు తగిన ఆయుధ సంపత్తి అవసరమని చెప్పారు.

సకాలంలో పూర్తికాని ప్రాజెక్టులు

స్వదేశీ పరిజ్ఞానంతో చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం అవుతుండటంపై అమర్‌ప్రీత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టులపై సంతకాలు చేసేటప్పుడే ఆ వ్యవస్థలు ఎప్పటికీ తమ చేతికి రావని తెలుస్తోందని విమర్శించారు. అందుకు ఉదాహరణ తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ ఎంకే1ఏ’ కార్యక్రమమేనని అన్నా రు. 2021 ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో రూ. 48వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరినప్పటికీ, ఆర్డర్ చేసిన 83 విమానాల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు అందలేదని పేర్కొన్నారు.

‘తేజస్ ఎంకే1’ చాలా ఆలస్యమైందని, ఇక తేజస్ ఎంకే2 ప్రొటోటైప్ కూడా బయటకు రాలేదన్నారు. ‘అమ్మా’ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క నమూనా విమానం కూడా విడుదల కాకపోవడం పరిస్థితికి అద్దం పడుతుందని తెలిపారు. కాలపరిమితి పెద్ద సమస్యగా మారిపోయిందని, అందుకే ఒక్క ప్రాజెక్టు కూడా సమయానికి పూర్తయినట్టు తనకు గుర్తుకురావడం లేదని అమర్ ప్రీత్ వ్యాఖ్యానించారు.

డిజైనింగ్‌పై దృష్టి పెట్టాలి

రక్షణ వ్యవస్థ బలోపేతంలో భాగంగా భారత్‌లో ప్రాజెక్టుల తయారీ చేయడం గురించే కాదు.. వాటి డిజైనింగ్ తీరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. దళాలకు, పరిశ్రమలకు మధ్య నమ్మకం ఉండాల న్నారు. అన్ని విషయాల్లో పారదర్శకత అవసరమని, మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దానిని అందించి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా’ కోసం వాయుసేన శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. ఇవాళ సంసిద్ధంగా ఉంటేనే భవిష్యత్తుకు సన్నద్ధం కాగలమని, రానున్న పదేళ్లలో మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవని తెలిపారు. 

వేగంగా మారుతున్న యుద్ధ రంగం..

యుద్ధ రంగంలో సాంకేతికత వేగంగా మారిపోతుందని ఎయిర్ చీఫ్ మార్షల్ సూచించారు. రోజురోజుకు టెక్నాలజీ మారిపోతుం దని, అవి మన యుద్ధ తంత్రాల్లో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’తో తాము భవిష్యత్తులో ఏ దిశగా పయ నిం చాలో, ఎలాంటి వనరులు అవసరమో స్పష్టం చేసిందన్నారు. ఇందులో భాగంగానే అధునాత మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)లో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యానికి అనుమతి లభించడం పెద్ద ముందడుగని ప్రశంసించారు. ప్రై వేటు పరిశ్రమలపై దేశానికి ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని, భవిష్యత్తు లో భారీ మార్పులకు ఇది బాటలు పరుస్తోందని వెల్లడించారు.

గొప్ప విజయం ‘ఆపరేషన్ సిందూర్’ 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశానికి దక్కిన గొప్ప విజయమని చెప్పారు. ఇది భారత త్రివిధ దళాలు సాధించిన గెలుపు అని అభివర్ణించారు. అత్యంత ప్రణాళికాబద్ధంగా, వృత్తి నైపుణ్యంతో ఈ ఆపరేషన్‌ను అమలు చేశామని, తాము సత్య మార్గంలో నడిచామన్నారు. అందుకే దైవం కూడా తమకు అండగా నిలిచిందని నమ్ముతున్నట్టు అమర్ ప్రీత్ అభిప్రాయపడ్డారు. ఈ కచ్చితమైన దాడుల ద్వారా భవిష్యత్తు రక్షణ అవసరాలు, వ్యూహాలపై భారత్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని తెలిపారు.