19-02-2026 12:57:49 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మాతా, శిశు కేంద్ర భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మాత శిశు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కోదాడలో నవజాత శిశువును వదిలేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ దీర్బాంతి వ్యక్తం చేశారు. ఆడ శిశువులను పుట్టగానే వదిలేయడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉయ్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైతే పిల్లలను వద్దనుకుంటారో ఆ ఉయ్యాలలో శిశువును ఉంచాలని సూచించారు. కోదాడలో నవజాత శిశువును కాపాడిన ఏఎన్ఎం ను కలెక్టర్ అభినందించారు.
వచ్చే నెలలోపు మాత శిశు కేంద్రం పైన నిర్మిస్తున్న భవన నిర్మాణాలను పూర్తి చేసి సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. వచ్చే వారం మరోసారి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మాతా, శిశు కేంద్రంలో కావాల్సిన ఎక్యూప్ మెంట్ కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని నిత్యం హాస్పిటల్ లో రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈయన వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, సి.ఎస్. ఆర్ఏమ్ఓ జనార్దన్ రెడ్డి, డాక్టర్స్, డిడబ్ల్యూఓ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.