మిషన్ భగీరథలో మురికి నీరు సరఫరా – తీవ్ర ఇబ్బందుల్లో కాలనీవాసులు
తీవ్ర ఇబ్బందుల్లో కోనరావుపేట కాలనీవాసులు,
తక్షణ చర్యలకు డిమాండ్
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) పథకం ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు మురికిగా రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుద్ధమైన త్రాగునీరు అందించాలని ఆశించిన ప్రజలకు, ప్రస్తుతం కలుషిత నీరు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. త్రాగునీరు పూర్తిగా మురికిగా ఉండటంతో ప్రజలు దానిని తాగడానికి మాత్రమే కాకుండా, రోజువారీ అవసరాలకు కూడా ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో నీరు దుర్వాసనతో రావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమస్య పునరావృతం అవుతుండటంతో ప్రజలు, వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఈ పరిస్థితిలో మరింత కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సి వస్తోందని, అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని కాలనీవాసులు తెలిపారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి, నీటి శుద్ధి ప్రక్రియను మెరుగుపరచాలని, పైపులైన్లలో ఉన్న లోపాలను సరిచేసి శుద్ధమైన త్రాగునీరు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని, సురక్షితమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని కాలనీవాసులు పేర్కొన్నారు.




