20-06-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, జూన్ 19: గండిపేట చెరువును ఆనుకొని అడ్డగోలుగా కన్వెన్షన్లు, షెడ్లు వెలుస్తున్నా నార్సింగి మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ప్రకటనలో ఆరోపించారు. నార్సింగి మున్సిపల్ పరిధిలోని జన్వాడ గ్రామంతోపాటు గండిపేట చెరువు చుట్టూ భారీ ఎత్తున అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా కన్వెన్షన్లు వెలుస్తున్నాయని ఆరోపించారు.
అందులో కొన్ని ఏడాది క్రితం పూర్తి కాగా ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ నిర్మాణాలు గండిపేట చెరువు నీటి అంచు నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో లోపలే ఉన్నాయని పేర్కొన్నారు. జన్వాడ గ్రామ పంచాయతీ ఏడాది క్రితం నార్సింగి మునిసిపాలిటీలో విలీనం అయింది. కొత్తగా కడుతున్న కన్వెన్షన్ సెంటర్లు గ్రామ పంచాయతీల నుంచి పర్మిషన్లు తీసుకున్నాయా అని విచారించగా అందుకు నిర్మాణదారులు అనుమతులు తీసుకోలేదని చెప్పారు.
నార్సింగి మునిసిపల్ కమిషనర్ను సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగగా కన్వెన్షన్ సెంటర్లు చాలా కాలం క్రితం నిర్మాణమయినవని, జన్వాడ గ్రామ పంచాయతీ వాటికి సంబంధించిన పత్రాలు తమకు ఇవ్వలేదని పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చాలా కాలం కింద నిర్మాణం జరిగినా వాటికి ఇంటి నంబర్లు ఎందుకు ఇవ్వలేదని, ఆస్థి పన్ను ఎంపదకు చెల్లించడం లేదని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.