calender_icon.png 5 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అనకొండ

05-12-2025 01:20:18 AM

హిల్ట్ పాలసీ పేరిట రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం

  1. ఉపాధి కల్పించే భూములు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం 
  2. ఈ అంశంపై బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు
  3. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : తెలంగాణ సీఎం పేరు అనుము ల రేవంత్ రెడ్డి కాదు.. అవినీతి అనకొండ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తార కరామారావు విమర్శించారు. హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కేటీఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని పలు పరిశ్రమలను సందర్శించి, అక్కడి సమస్యలపై కార్మికులతో, పారిశ్రామిక వేత్తలతో చర్చించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో రూ. 5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపా ధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. పరిశ్రమలు వద్దం టూ, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోమని పారిశ్రామి క భూములను ఇస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవే ట్ వ్యక్తుల భూములు కావని, ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములని స్పష్టం చేశారు. కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇచ్చినట్టు తెలిపారు. మార్కెట్‌లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం 4,000 రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి స్మశానాలకు కూడా స్థలం లేదు, కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోందని విమర్శించారు. ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో స్థలం లేదని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదని అన్నారు.

ఇక్కడ ఉన్న కంపెనీలు తరలివెళ్తే, హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే నేడు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామని, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని ఇక్కడితో బీఆర్‌ఎస్ పార్టీ వదిలిపెట్టదని, హిల్ట్ పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తామని తెలియజేశారు..


ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని, ఈ పాలసీని వెనక్కి తీసుకొని, లక్షల కోట్ల విలువైవ ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. రేవంత్‌రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే, అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని దోపిడీని చూసి తట్టుకోలేక తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న తెలంగాణ బిడ్డ మాకు సమాచారం ఇచ్చారని, ప్రభుత్వం చేస్తున్న దోపిడీపైన తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సమాచారం లీక్ అయింది అంటూ బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ. 170 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున భూములు అమ్మిన ప్రభుత్వం అంటూ రోజు వార్తలు రాపిచ్చుకుంటున్న ప్రభుత్వం మరోవైపు కేవలం కోటి రూపాయలకు ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమి ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి క్షేత్రస్థాయిలో ఉన్న నిదర్శనమని స్పష్టం చేశారు. తాము గతంలో తెచ్చిన గ్రిడ్ పాలసీ ద్వారా కేవలం ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండేదని, ఐటీ కార్యాలయాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరిగాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తమ పాలసీ ఆదర్శం అయితే.. ఈ పారిశ్రామిక భూములలో ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు మాత్రమే తిరిగి భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మాత్రమే అనుమతించాలని, అంతేకానీ అప్పనంగా అపార్ట్మెంట్లకు, విల్లాలకు ఇస్తామంటే కుదరదని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలు బయటకి పంపించాలన్నదే అందరి ఉద్దేశమని, అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మసిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

దాన్ని కూడా రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారని, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమేనని, అందుకే అక్కడ ఫార్మాసిటీలో ఇక్కడ పారిశ్రామిక భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్ది, పార్లమెంటరీ ఇంచార్జీ రాగిడి లక్ష్మారెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.