03-11-2025 05:04:52 PM
నిర్మల్ జిల్లా (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని నాగేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానన్, సిపిఓ వెంకటేశ్వర్లతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఫ్యాక్టరీలో తూకం యంత్రానికి, పత్తి తీసుకువచ్చిన ఎడ్ల బండికి పూజలు చేసిన అనంతరం తూకం వేశారు. పార్డి కే గ్రామానికి చెందిన సురేష్ అనే రైతును శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏడీఎం గజానన్ మాట్లాడుతూ రైతులు తమ పత్తిని ఆరబెట్టుకుని 8 నుండి 12 మాయిశ్చర్ వచ్చేలా చూసుకోవాలని, కపాస్ యాప్ ద్వారా విక్రయానికి సంబంధించిన స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు అధికారులతో వాదనకు దిగారు. ప్రతిరోజు వర్షం కురుస్తోందని ఎక్కడ ఆరబెట్టాలని ఏ పత్తిని చూసినా కనీసం 18 నుంచి 20మైశ్చర్ వస్తుందని అధికారులు రైతులపై కనికరించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న సిసిఐ సిపిఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాకు స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయని మైశ్చరైసర్ విషయంలో ఎవరికీ వెసులుబాటు లేదని ఎలాంటి పరిస్థితుల్లో నైనా 8 నుండి 12 మాయిశ్చర్ ఉండడంతో పాటు ఎకరాకు ఏడు క్వింటాళ్ళు మాత్రమే సీసీఎల్ తూకం వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
స్లాట్ బుకింగ్ చేసుకుని సీసీఐకి పత్తిని తీసుకురావాలని సూచించారు. ఆయా గ్రామాల రైతులు అధికారులతో గంటసేపు వాదించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని గైడ్లైన్స్ను అందరూ ఫాలో అవ్వాలని రైతులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు. తాసిల్దార్ శివరాజ్, భైంసా వ్యవసాయ శాఖ ఏడిఏ వీణ, ఏవో సారికారావు, మార్కెట్ కమిటీ కార్యదర్శి జంగం రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, ఆత్మ చైర్మన్ సిద్ధం వార్ వివేక్, వ్యాపారులు రెడ్డి శెట్టి సంతోష్, ఆనంద్, ఆయా గ్రామాల పత్తి రైతులు, నాయకులు పాల్గొన్నారు.