30 April, 2026 | 1:47 PM

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు

28-04-2026 06:50 PM

కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

కొత్తగూడెం,(విజయక్రాంతి):  కొత్తగూడెం పట్టణ పరిధిలో వివిధ సందర్భాల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగూడెం టౌన్ తో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో పలు సందర్భాల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడి కేసులను నమోదు అయిన యువకులను పిలిపించి వారి తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై యువకులు తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకొని తమ తల్లిదండ్రులకు,తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  సారధ్యంలో ఇకపై కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరంతరం గస్తీని పెంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమంగా గంజాయి సరఫరా చేస్తునట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోపంగా ఉంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ సిఐ ప్రతాప్, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు,వన్టౌన్ సిఐ కరుణాకర్,త్రీటౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.