01-06-2025 08:32:57 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మార్కెట్లోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ అడ్డుకట్ట వేసి రైతులకు నష్టం కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ సత్యనారాయణ(State Vice President Jada Satyanarayana) కోరారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలను అందజేయాలన్నారు. బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న రుణాల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అమలు చేసి కొత్తగా రైతులకు రుణాలు అందజేయాలన్నారు.
పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పంటల కనీసం మద్దతు ధర కంటి తుడుపు చర్యగా మారిందని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ ఐలయ్య, నాయకులు సక్రు, యాకన్న, లింగన్న, మురళి, బాబన్న, వెంకన్న, దేవేందర్ పాల్గొన్నారు.