అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులకు అంతం లేదు
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శితక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు
భూపాలపల్లిలో సిపిఐ రాజకీయ శిక్షణ శిబిరం ప్రారంభం
భూపాలపల్లి,(విజయ క్రాంతి): అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులకు అంతం లేదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూరు నగర్లోని ఇల్లందు క్లబ్లో మోట పలుకుల రమేష్ అధ్యక్షతన జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ముందుగా సిపిఐ పతాకాన్ని ఎగురవేసి శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ శక్తులకు ప్రోత్సాహం ఇస్తూ, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే వామపక్షాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం, భూముల పట్టాల విషయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. జీవో 58 ప్రకారం గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల మద్దతుతోనే ప్రభుత్వాలు కొనసాగగలవని ఆయన అన్నారు.






