07-06-2025 09:04:08 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి..
సూర్యాపేట (విజయక్రాంతి): హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఈనెల 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరిగే సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి(Party District Secretary Mallu Nagarjuna Reddy) పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు మూడు రోజులపాటు రాజకీయ చైతన్యం కలిగించడం జరుగుతుందన్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజలపై పెనుబారం మోపుతుందన్నారు. ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను హతం చేస్తుందన్నారు. చర్చలకు సిద్ధమని చెప్పిన వినకుండా నరమేధాన్ని చేస్తుందన్నారు. మరోపక్క పాకిస్తాన్ తో చర్చలు జరుపుతూ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోపక్క ఈ దేశ పౌరులైన మావోయిస్టుల పై మారణ హోమం సృష్టిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు అవుతున్న భౌగోళిక తెలంగాణగా మాత్రమే అవతరించిందన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి నేటికీ తెలంగాణ ప్రజలకు అందలేదన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ శిక్షణ తరగతులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులునెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.