మోడిఫైడ్ సైలెన్సర్లపై ఉక్కుపాదం
- రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించిన సీపీ
సిద్దిపేట క్రైం, ఆగస్టు 22 : ద్విచక్ర వాహనాలకు భారీ శబ్దాలు చేసే మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వారిపై సిద్దిపేట పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టుబడిన సైలెన్సర్లను శనివారం రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal) మాట్లాడుతూ, అధిక శబ్దంతో కూడిన సైలెన్సర్ల వల్ల వృద్ధులు, చిన్నారులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
రాత్రి సమయాల్లో మోడిఫైడ్ సైలెన్సర్ల శబ్దం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అటువంటి సైలెన్సర్లను విక్రయించినా, అమర్చినా సంబంధిత మెకానిక్ లు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ ధరించాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదని, ఓవర్ స్పీడ్ తో వాహనాలు నడపవద్దని సీపీ సూచించారు.






