08-06-2025 12:00:00 AM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట అత్యంత విచారకరం. ఒక క్రికెట్ లీగ్ కప్పు విజేతలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి స్టేడియంలో సభ ఏర్పాటు చేయటం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు ఒకే దగ్గర చేరారు. దీంతో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. ఐపీఎల్ క్రికెట్ లీగ్ మ్యాచ్లు క్రికెట్కు ఊతమిస్తున్నాయనటంలో సందేహం లేదు. కానీ, ఈ లీగ్ క్రికెట్ మ్యాచ్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పరిధిలోకి రావు.
ఇవి పూర్తిగా బీసీసీఐకి సంబంధించినవి. ఈ క్రికెట్ లీగ్ రికార్డులు ఆ లీగ్లకే పరిమితం. అంతర్జాతీయ రికార్డులుగా గుర్తింపు లేదు. వాణిజ్య సంస్థలు క్రికెట్లోకి జొరబడి వారి వ్యాపార ప్రయోజనాలకు, వ్యాపార బ్రాండ్ల ప్రచారానికి తెరలేపుతూ లీగ్ల కోసం ఆటగాళ్ళను వేలంలో కొనుగోలు చేయటం పూర్తి బిజినెస్ ఫార్మాట్. ఇటువంటి లీగ్లకు ప్రజలను ఒక వ్యసనం మాదిరిగా ఐపీఎల్ క్రికెట్ తయారుచేసింది. బీసీసీఐ, ఐపీల్ డబ్బు కోసం క్రికెట్ను వ్యాపారంగా మార్చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ధోరణి మారాలి.
- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్