08-06-2025 12:00:00 AM
భారత పార్లమెంట్ ద్వారా ప్రజల హక్కులను కాపాడటానికి చట్టాలు రూపొందాయి. వీటిలో కార్మికులు, స్త్రీలు, బాలలు, వృద్ధులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. అంధత్వం, దృష్టి లోపం, కుష్టు, వినికిడి లోపం, చలనం లేని వైకల్యం, మానసిక అనారోగ్యం లాంటి లోపాలను గుర్తించారు. ఇలాంటి లోపాలున్న వ్యక్తులకు ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు సమాజంలో ప్రత్యేక గుర్తింపు కల్పించే బాధ్యత అధికారులపై ఉంది.
2014లోని ఒక నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12.2% వికలాంగులు ఉన్నారు. వికలాంగులు అంటేనే ప్రజల మనసులో తళుక్కున మెరిసే వారు అంధులు, బధిరులు మాత్రమే. మానసికంగా శారీరక ఎదుగుదల లేని చాలామంది ఆద రణ లేక చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పిస్తున్నాయి.
మానసిక వికలాంగులలో మానసిక వైఫల్యం, మానసిక అనారోగ్యం రెండు రకాలుగా ఉంటారు. వీరిలో మానసిక వైఫల్యం పుట్టుకతో వచ్చేది. రెండవది వారు జీవించే స్థితిలో ఏర్పడేది. నేడు ఎక్కువగా ఇలాంటి ఎందరో మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి సౌకర్యాలు లభించడం లేదు. రైల్వేలలో అన్ని రకాల వికలాంగులతోపాటు వారి అనుచరులకూ రాయితీలు కల్పిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, విద్యార్థులకు వికలాంగులకు, విలేకరులకు బస్ పాసులు ఇస్తూ రాయితీలు ఇస్తున్నది. మానసిక రోగులు చికిత్స కోసం నగరాలకు రావడం ఖర్చుతో కూడుకున్న పని. వీరి ప్రయాణ నిమిత్తం కూడా బస్సుల్లో పాసులు, రాయితీలు కల్పించాలి.
ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్