అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులే
30-05-2026 08:45 PM
కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్
జవహర్ నగర్,(విజయక్రాంతి): అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, జవహర్ నగర్ లో పూర్తిగా సర్కారు భూములే ఉన్నాయని, పేద ప్రజలు ప్లాట్లు కొని మోసపోవొద్దని తహసీల్దార్ రాజేష్ హెచ్చరించారు. కాప్రా తహసీల్దార్ రాజేష్ ఆదేశాల మేరకు జవహర్ నగర్ లోని పలు అక్రమ కట్టడాలను శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్బంగా రాజేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తున్నామని, కబ్జాదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని అన్నారు. అంబేద్కర్ నగర్, వికలాంగుల కాలనీ, బీజేఆర్ నగర్ లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






