29-05-2025 01:48:59 AM
- రాష్ట్రవ్యాప్తంగా 51,528 ఎకరాల్లో పంటనష్టం
- రైతుల బ్యాంక్ఖాతాల్లో జమచేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వడగళ్ల వాన కారణంగా అనేక ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం బుధవారం విడుదల చేసింది.
సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో వ్యవసాయశాఖ అధికారులు పంటనష్టం అంచనా వేసి ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 41,361మంది రైతులకు సంబంధించి 51,528ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు ప్రభుత్వం రూ.51.528కోట్లను నిధులను మంజూరు చేసింది.
ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని పంట నష్టపోయిన రైతులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పం టలు 6,589 ఎకరాలు, పత్తి 4,753 ఎకరాలతో పాటు ఇతర పంటలు 477 (ప్రాణ హిత వరదల మూలంగా సంభవించిన నష్టం) ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. అయితే మే నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేసి ఈ వారమే పం పగా, వాటికి సంబంధించిన నిధులు మం జూరు కవావాల్సి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు.