calender_icon.png 30 May, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓ తండ్రి వ్యధ!

29-05-2025 01:44:54 AM

ఘర్ ఘర్‌కి కహాని

ప్రాంతీయ పార్టీల్లో తండ్రులకు పరీక్ష పెడుతున్న వారసులు

ఓ తండ్రి తన జీవితమంతా కష్టపడి ఓ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఎక్కడో మొదలైన జీవితాన్ని అంచెలంచెలుగా లక్ష్యాన్ని అందుకునేలా మలుచుకుంటాడు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపును  తెచ్చుకుంటాడు.

తనకున్న మర్యాద, అంతస్తుతో తన సంతానం కూడా ఉన్నతంగా జీవించాలని ఆ తండ్రి కలలు గంటాడు. ఉన్నత స్థాయి, సంపన్న తండ్రులే కాదు.. కడుపుకు మూడు పూటలా తిండిపెట్టి తన సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దే తండ్రులూ ఉంటారు. కాని చివరికి ఏమవుతున్నది..? తండ్రి మాట వినని సంతానం, ఇష్టారీతిలో వ్యవహరిస్తున్న కాలం దాపు రించింది.

చర, స్థిరాస్తులు, బ్యాంకు బ్యాలెన్సులు.. తండ్రి ఎన్ని సమకూరిస్తేనేం.. ఆ తండ్రిని తులనాడే సంతానం పుట్టుకొస్తున్నది. చివరికి తండ్రికి అంతి మ సంస్కా రం జరపాలంటేనే నువ్వంటే నువ్వు అని తప్పుకోజూస్తు న్న పిల్లల్ని ఇప్పటి సమాజం చూస్తున్నది. ఇది ఇంటింటి కథగా మారుతున్నది. ఈ దౌర్భాగ్య కాలంలో ప్రతి తండ్రి చరమాంకం ఓ వ్యధగా మారుతున్నది.

రాజకీయరంగం కూడా దీనికి మినహాయింపు కాదు. కన్న బిడ్డలే కాదు, బంధు వర్గమూ.. తమను పైకి తీసుకొచ్చిన వారికి చెల్లుచీటీ అంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. రాజకీయా ల్లో ఓ వెలుగు వెలిగిన తండ్రుల కు ఎదిగిన తమ పిల్లలతో సమస్య లు ఎదుర వుతు న్నాయి. అంతబతుకూ బతికిన ఆ తండ్రులు చివరికి మిన్నకుండిపోవాల్సి వస్తున్నది.

హైదరాబాద్, మే 28(విజయక్రాంతి): మనదేశంలో రాజకీయ పార్టీలు.. ప్రధానం గా ప్రాంతీయ పార్టీలు చాలావరకు వ్యక్తి కేంద్రంగా నడుస్తుంటాయి. పార్టీ పెద్దనే అన్నీఅయి నడిపిస్తుంటారు. ఇక అనివార్యంగా పార్టీలోకి వారసులు వస్తే.. వారి ప్రాధాన్యతను తగ్గించలేక.. అట్లాగని వారిని వారించలేక ఆ పార్టీ పెద్ద పడే ఇబ్బందులు ఎన్నో.

ప్రాంతీయ పార్టీలు అంతిమంగా కుటుంబ పార్టీలుగానే మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత దాదాపు ముప్పు ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చి విజయవంతంగా తెలంగాణ కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

కేసీఆర్‌గా పిలు చుకునే ఆయన.. అప్పటికే విఫలయత్నంగా ఉన్న తెలంగాణ ఉద్యమానికి ఓ భరోసాను నింపారు. తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పారు. అంతకుముందే అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలపై రాష్ట్రంలో ఓ ఉద్యమ నడుస్తోంది.

ప్రధానంగా బోరుబావుల మీద వ్యవసాయం చేసే తెలంగాణ రైతులకు ఆ పెంచిన కరెంటు చార్జీలు మోయలేని భారంగా మారుతాయంటూ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ అప్పటి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అనంతరం 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరున కేసీఆర్ పార్టీని ఆరంభించారు.

అది సంచలనంగా మారింది. అప్పుడు ఆయన తో తెలంగాణ సిద్ధ్దాంత కర్తగా ఉన్న ప్రొఫె సర్ జయశంకర్, తెలంగాణ మేధావులు, వివిధ పార్టీల్లోని తెలంగాణవాదులు కలిసి నడిచారు. చంద్రబాబు నాయుడి రాజకీయ చతురతను ఎదుర్కొని టీఆర్‌ఎస్‌ను తెలంగాణలో బలీమైన రాజకీయ పార్టీ గా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.

పార్టీ ఆరంభంలో రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు కేసీఆర్‌కు తోడుగా తన సోదరి కుమారుడు, మేనల్లుడు హారీశ్‌రావుకు పార్టీకి చెందిన కార్యక్రమాల బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి హారీశ్‌రావు టీఆర్‌ఎస్‌లో ఏ సమస్య వచ్చినా తీర్చే ఓ ట్రబుల్ షూటర్‌గా ఎదిగారు.

టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో నిర్వహించిన బహిరంగ సభలకు పెద్ద ఎత్తున జనాలు రావడం, తెలంగాణ ఉద్యమానికి జాతీయ స్థాయి నేతలు శిబూ సోర న్, శరద్ పవార్, రాంవిలాస్ పాశ్వాన్, దేవేగౌడ, అజిత్ సింగ్ లాంటి నేతలు, స్వామి అగ్నివేష్ లాంటి సామాజిక ఉద్యమకారులు సభలకు రావడంతో తెలంగాణ డిమాండ్ జాతీయస్థాయిలో బలమైన డిమాండ్‌గా మారింది. 2004లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే అనివార్యత ఏర్పడింది.

ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 26 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు సాధించింది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీనితో రాష్ట్ర, కేంద్ర మంత్రి వర్గంలోకి టీఆర్‌ఎస్ చేరింది. కేంద్రంలో కేసీఆర్, నరేంద్రలు మంత్రులయ్యారు. రాష్ట్రంలో హారీష్ రావు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా టీఆర్‌ఎస్ పార్టీ అంచలంచెలుగా వృద్ధి చెంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఇక తెలంగాణ డిమాండ్‌కు జాతీయస్ధాయిలో మరింత గుర్తింపు వచ్చింది.

ఈ సమయంలోనే కాంగ్రెస్‌తో విభేదించిన టీఆర్‌ఎస్ కేంద్రం, రాష్ట్ర మంత్రి వర్గం నుంచి రాజీనామాలు చేసి బయటకు వచ్చారు. ఈ సమయంలోనే అమెరికా నుంచి వచ్చిన కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు, కూతురు కవితలు క్రమక్రమంగా టీఆర్‌ఎస్‌లో కీలక నేతలుగా ఎదిగారు.

సహజంగానే అధినేత వారసులుగా వారికి పార్టీలో ప్రాధాన్యత పెరుగు తూ వచ్చింది. కేటీఆర్‌కు కేసీఆర్‌లాగా వ్యాక్చాతుర్యం ఉండటంతో చక్కటి స్పీకర్‌గా గుర్తింపు వచ్చింది. అనేక పార్టీ కార్యక్రమా ల్లో కేటీఆర్ పాల్గొని తన ప్రసంగాలతో ఆకట్టుకునే వారు. ఇక కూతురు కవిత తెలం గాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం చేయడంలో విజయవంతమయ్యారు. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె బతుకమ్మ పండుగను విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందేలా కార్యక్రమాలు చేపట్టారు.

కవిత కూడా ప్రజాదరణ పొందడంలో సక్సెస్ అయ్యారు. తోడల్లుడు కుమారుడైన సంతోష్ రావు కేసీఆర్ వ్యక్తిగత సహాయకునిగా ఉంటూ పార్టీలో మరో కీలక నేతగా ఎదిగారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీశ్‌రావు, 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆ ర్‌లు గెలిచారు. కవిత తెలంగాణ జాగృతిని తెలంగాణలో క్రమంగా విస్తరిస్తూ ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ ఉద్యమానికి సాంసృతిక భూమిక ఏర్పాటు అయ్యేందుకు కృషి చేశా రు.

2009లో కేసీఆర్ నిరాహార దీక్షను ప్రకటించడం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేయడం, తర్వాత వెనక్కి వెళ్లడంతో తెలంగాణ ఉద్యమం టీజేఏసీ కేంద్రంగా నడిచింది. ఆ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ నేతలుగా హరీశ్ రావు, కేటీఆర్, కవితలు ఎన్నో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లి తెలం గాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది.

మంత్రులుగా హరీశ్‌రావు, కేటీఆర్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. కవిత నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ మధ్యలో సంతోష్‌రావు రాజ్యసభ సభ్యుడయ్యారు. పదేళ్ల పాటు టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నది. ఈ మధ్యలోనే జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న కేసీఆర్ పార్టీని బీఆర్‌ఎస్‌గా పేరు మార్చారు. మహారాష్ట్రలో అనేక కార్యక్రమాలను బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ నిర్వహించారు. ఈ పదేళ్లలో హరీశ్‌రావు, కేటీఆర్, కవిత, సంతోష్‌రావులు గులాబీ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు.

పార్టీ శ్రేణులు కూడా వారికి సన్నిహితంగా మెలిగారు. కార్యకర్తలకు అందుబా టులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ విజయం కోసం తమకు కేసీఆర్ అప్పగించిన ఏ కార్యక్రమాన్నైనా వారు నిర్వర్తించారు. పార్టీ విస్తరణకు, విజయాలకు తమ వంతుగా పాటుపడ్డారు. అయితే ఇదే క్రమంలో అటు ప్రతిపక్ష పార్టీలు, ఇటు రాజకీయ వర్గాల నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అంటూ విమ ర్శలు మొదలయ్యాయి.

టీఆర్‌ఎస్ పార్టీలో మొదటి నుంచి కీలక నేతలు పార్టీని వీడారు. కేసీఆర్ వ్యవహారశైలి నచ్చక కొందరు, కొందరి నేతల వ్యవహర శైలి నచ్చక కేసీఆర్ ఇలా నేతలు కారు పార్టీని వీడారు. మరి కొందరు క్లిష్ట సమయంలో కేసీఆర్‌ను వదిలేసి తమ దారి తాము చూసుకున్నారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులుగా ఉన్న వీరు పార్టీ పెద్ద ఇచ్చిన  బాద్యతలు బుజాన వేసుకొని ప్రజల్లోకి సమర్ధులుగా రాణించారన్నది వాస్తమేనని ప్రతిపక్ష పార్టీలు సైతం అంగీకరిస్తాయి.

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా కుటుంబ పార్టీ అని విమర్శులు ఎదుర్కొన్నది. నలుగురే పార్టీని నడిపిస్తున్నారంటూ ఆరోపణలను వారు ఎదుర్కొన్నారు. పార్టీకి ఏ నియోజకవర్గంలోనైనా, ఏ నేతతోనైనా ఇబ్బందులు ఉన్నప్పు డు ట్రబుల్ షూటర్‌గా హరీశ్‌రావు రంగంలోకి దిగి ఆ సమస్యను పరిష్కరిస్తారనే పేరు పొందారు.

ఇక కేటీఆర్ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రిగా మంచి పేరును సాధించారు. హైదరాబాద్‌లో అభివృద్ధికి కేటీఆర్ ఎంతో కృషి చేశారంటూ కారు పార్టీ క్యాడర్ చెప్పుకునే స్థాయిలో ఆయన పని చేశారు. కేటీఆర్ కేసీర్ రెండో సారి సీఎంగా బాద్యతలు చేపట్టిన తర్వాత పార్టీ యాక్టివిటీ పెం చేందుకు క్యాడర్‌కు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆయన్ని కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్‌ఎస్ కీలక అత్యంత కీలక నేత గా మారారు.

తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు లక్షలాది చెట్లను నాటడం ద్వారా సంతోష్‌రావు జాతీయ స్థాయిలో పేరు సా ధించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ సహాజంగానే పార్టీ అధినేత వారసులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. క్యాడర్‌కు కూడా సానుకూలత ఉంటుంది. కానీ, ఎప్పుడైతే బీఆర్‌ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారసులపై చర్చ మొదలైంది. పార్టీ అగ్రనేతలకు ఇబ్బందులు మొదలయ్యాయి.

లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ ఆరోపణలు రావడం, ఆమె ఐదు నెలలు తీహార్ జైలులో గడపాల్సి వచ్చింది. ప్రస్తు తం ఆమె బెయిలపై ఉన్నారు. ఇక కేటీఆర్‌పై ఫార్ములా ఈ కారు రేసులో ఆయనకు ఇటీవల ఏసీబీ నోటీసులు పంపింది. ఇక ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగిపోవడం ఆ అంశంపై ఏర్పాటైన కమిషన్ హరీశ్‌రావు, కేసీఆర్‌లకు విచారణ రావాలంటూ నోటీసులు ఇవ్వడం ఇలా బీఆర్‌ఎస్‌ను రాజకీయ ఇబ్బందులు మొదల య్యాయి.

ఈ లోపుగా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభ నిర్వహణ, కేసీఆర్ ప్రసం గం కేంద్రంగా కవిత లేఖ రాయడం, కేసీఆర్ దేవుడైనా ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేయడం, పార్టీ బాగుం డాలంటే కోవర్టులను బయటకు పంపాలని చేసిన వ్యాక్యలు కలకలం రేపాయి కేటీఆర్ కూడా రేవంత్ కోవర్టులో అన్ని పార్టీల్లో ఉన్నారని, మా పార్టీలో కూడా ఉండొచ్చని వారు తగిన సమయంలో బయటకు వస్తారంటూ చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొన్నది.

కవిత లేఖ ద్వారా ఉత్పన్నమైన సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ ఏం చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటి దాకా కవితతో కేసీఆర్ సమావేశమై ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలేవి చేయకపోవడంతో ఒక రకమైన రాజకీయ అనిశ్చితి కారు పార్టీలో నెలకొన్నది.

ఒకప్పుడు ఒక్కడిగా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ప్రజల్లోకి వెళ్లి, పెద్ద బహిరంగ సభలను నిర్వహించి, జాతీయ స్థాయిలో తెలంగాణకు మద్దతుగా పార్టీలను కూడగట్టి, యూపీఏ కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌లో తెలంగాణ అంశాన్ని చేర్పించి, తెలంగాణ కోసం అనేక సార్లు రాజీనామా అస్త్రాలను ప్రయోగించి ఉప ఎన్నికల్లో గెల్చి తెలంగాణ డిమాండ్‌ను నిత్యం లైవ్‌లో ఉంచిన గులాబీ బాస్ ఇప్పు డు ఈ వారసుల ఆధిపత్యపు పోరుకు ఏ విధంగా ఎండ్ కార్డు వేస్తారన్నదే ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.

అప ర చాణుక్యుడిగా రాజకీయాల్లో పేరున్న కేసీఆర్‌కు ఇప్పుడున్న క్లిష్టమైన కఠినమైన పరీక్ష ఇంతకుముందు ఎదురు కాలేదన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ నిర్ణయంపై కారు పా ర్టీ క్యాడర్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. బీఆర్‌ఎస్ లాగానే దేశంలో చాలా వరకు ప్రాంతీయ పార్టీలు వారసత్వ సమస్యలు ఎదుర్కొన్నవే. కొన్ని పార్టీలు ఇంకా ఈ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాయి. 

సమాజ్‌వాది పార్టీలో..

యూపీ విషయానికి వస్తే సమాజ్ వాది పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కు మారుడు అఖిలేష్ యాదవ్, సో దరుడు శివపాల్ సింగ్ యాదవ్‌ల మద్య వారసత్వ పోరులో ఇబ్బందులు పడ్డారు. యాదవ్ కుటుం బం రెండు ప్రత్య ర్ధి వర్గాలుగా విడిపోయి తలపడ్డా రు. అఖిలేష్ యా దవ్‌కు మరో సోదరుడు రాజ్‌గోపాల్ యాదవ్ మద్దతు ఇచ్చారు.

శివ్‌పాల్ యాదవ్‌కు అప్పుడు పార్టీలో కీలకంగా పవర్ సెంటర్‌గా వ్యవహరించిన అమర్‌సింగ్ మద్దతు ఇచ్చారు. ఈ కుటుంబ పోరులో అఖిలేష్ యాదవ్ మంత్రివర్గం నుంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగిస్తే ములాయం సింగ్ అఖిలేష్‌ను, రాజ్‌గోపాల్ యాదవ్‌ను క్రమశిక్షణా రాహిత్యం కింద ఆరేళ్లూ ఎస్పీ పార్టీ నుంచి తొలగించారు. ఒకరోజు గడవక ముందే ఈ నిర్ణయాన్ని ములాయం ఉప సంహరించుకున్నారు. 

అయితే అఖిలేష్ తన తండ్రిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇది యూపీ రాకీయాల్లో సంచలనంగా మారింది. ములాయం కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎన్నికల సంఘం దాకా చేరింది. ములాయం, అఖిలేస్ మద్య పార్టీ తగదాలో ఈసీ జోక్యంతో అఖిలేష్ యాదవ్ అధికారికంగా ఎస్పీ జాతీయ అధ్యక్షుడయ్యారు.

యూపీలో బలమైన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌ను మట్టి కరిపించి సుదీర్ఘకాలం సమాజ్‌వాది పార్టీని విజయవంతంగా నడిపించిన ములాయం తన రాజకీయ జీవితంలో సోదరుడు, కుమారుడి మధ్యలో వారసత్వ పోరులో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఇక మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన అధినేత బాల్ ధాకరే ఒక దశలో తన సోదరుడు కుమారుడు రాజ్ ధాకరే తన కుమారుడు ఉద్దవ్ థాకరే మద్య వారసత్వ పోరును అనుభవించారనే ప్రచారం ఉంది.

90 దశకాల్లో బాలాసాహెబ్ వారసుడిగా రాజకీయ రంగంపై ప్రసిద్ది పొందిన రాజ్‌ధాక్రే తనకంటే ఉద్దవ్ ధాక్రేకే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారంటూ 2005లో శివసేన నుంచి బయటకు వచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను స్థాపించారు. శివసేన చీలిపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ధాక్రే పార్టీ చతికిల పడటంతో ఇప్పుడు సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్‌ధాక్రే మళ్లీ ఏకమవుతారన్న చర్చలు జరుగుతున్నాయి. 

జేడీ(ఎస్)లో..

కర్ణాటకలోనూ మాజీ ప్రధాని దేవేగౌడ తన మనువడు ప్రజ్వలో రేవణ్ణ విషయంలో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజ్వల్ 2024 లోక్‌సభ ఎన్నికలల్లో పోటీ చేసే సమయంలో లైంగిక వేధింపుల  ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనితో ఆయన జేడీ(ఎస్) నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రజ్వల్‌పై సిట్ విచారణ జరుగుతోంది. దేవేగౌడ లాంటి దిగ్గజ రాజకీయవేత్త కూడా పార్టీలో తన కుటుంబ వ్యక్తుల వ్యవహారంతో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. 

వైసీపీలో..

దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి ఫ్యామిలీలో లోనూ ప్రస్తుతం రాజకీయ  వివాదం నడుస్తోంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు సోదరి షర్మిళ మధ్య వివాదాలు తీవ్రమయ్యాయి. షర్మిళ తన అన్నకు పోటీగా తెలంగాణలో పార్టీ పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్నకు పోటీగా మరో సోదరితో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక తల్లి విజయమ్మ షర్మిళ వైపు నిలబడ్డారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు చాలావరకు ఏదో సమయంలో వారి వారసత్వ రాజకీయాలను ఎదుర్కొన్నవే.

పార్టీలను స్థాపించి ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి పార్టీని తీసుకువచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల్లో వారసులు రంగప్రవేశం చేయడం వారు పార్టీల్లో పవర్ సెంటర్లుగా మారడ వంటివి జరుగుతుంటాయి. పార్టీశ్రేణులు కూడా అధినేత కుటుంబ సభ్యులు అనే కోణంలో వారికి దగ్గరవుతుంటారు. పార్టీలో వారు కీలకం అవుతారు. ఇక పార్టీ పెద్దలు కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ పోరు తీవ్రమైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. 

తెలుగుదేశం పార్టీలో..

ఇక ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు తన చిన్నల్లుడు చంద్రబాబు నాయుడికి మధ్య రాజకీయ పోరు కొనసాగింది. 1995లో సీఎం అయిన ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలిగే సమయంలో పార్టీలో వారసత్వ పోరు తారాస్ధాయికి చేరింది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతీ, ఆయన అల్లుడు చంద్రబాబుకు మధ్య రాజకీయ వివాదాలు నడిచాయి.

ఈ పోరు కాస్తా ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దింపే స్థాయికి వచ్చింది. ఎన్టీఆర్ సీఎంగా దిగిపోయిన తర్వాత చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు ప్రత్యర్థ్ధి పార్టీల నుంచి ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో వారసత్వ పోరు ఓ దశలో సినిమా ట్విస్టులను తలపించింది.