15-02-2026 03:24:06 PM
కాగజ్నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలం ఈజ్గాం గ్రామంలోని శివ మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, పట్టణ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.
భక్తుల భద్రత దృష్ట్యా కాగజ్నగర్ రూరల్ సీఐ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం పుణ్యక్షేత్ర వాతావరణాన్ని సంతరించుకుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు శీతల పానీయాలు, భోజన వసతి, తాగునీటి సదుపాయాలను కల్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు సక్రమ దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టారు.