calender_icon.png 15 February, 2026 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలోని ఏడుపాయల అభివృద్ధి

15-02-2026 03:20:52 PM

* వనదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

* అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్ రావు

* పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు

* ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి

పాపన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏడుపాయల అభివృద్ధి జరిగిందని, కోట్లాది రూపాయలు మంజూరు చేయించి జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి, పశు సంపద వృద్ధి చెంది ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆ వనదుర్గమ్మ తల్లిని వేడుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. ఆదివారం మహాశివరాత్రి రోజున అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోహిత్ రావు శివాని దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంజీరా నదీ పాయలో ఏర్పాటు చేసిన శివయ్య విగ్రహం సెట్టింగ్ వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జాతర ప్రారంభించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ ఈవో వీరేశం ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రోహిత్ రావు మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడుపాయలను అభివృద్ధి చేసేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, మూడు రోజులపాటు కలెక్టర్, జిల్లా యంత్రాంగం అనునిత్యం అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తారని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏడుపాయల జాతరలో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహా జాతరలో తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర కోసం భక్తిపారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తుల తాకిడి క్రమేపి పెరుగుతుందని, ఆ వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని భక్తులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నగేష్, నాయకులు పాల్గొన్నారు.