calender_icon.png 25 October, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేమ ఉన్న పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకి తీసుకురావాలి

25-10-2025 12:25:05 AM

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి

మునుగోడు,అక్టోబర్ 24 (విజయక్రాంతి): అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని పత్తి రైతులు రెండు మూడు రోజులు ఆగి పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పత్తిలో తేమశాతం ఎక్కువ ఉంటే వెనక్కి పంపించే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, మునుగోడు మండల కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్ లో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తోటి నారాయణ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, మిల్లర్లతో కలసి ప్రారంభించి మాట్లాడారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పత్తిని కొనుగోలు చేయాలని ఆమె చెప్పారు. జిల్లా కలెక్టర్, డిసిసిబి చైర్మన్లు పత్తి తేమ శాతాన్ని, తూకం యంత్రం ద్వారా తూకాన్ని పరీక్షించారు . ఒక సీజన్లో రైతు మూడు సార్లు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఏదైనా కారణం చేత బుక్ చేసుకున్న స్లాట్ ను క్యాన్సల్ చేసుకోవచ్చని ,ఆ స్లాట్ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

మునుగోడు కేంద్రంలో 19000 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్నందున చుట్టుపక్కల రైతులకు పత్తి  అమ్మకంలో ఎలాంటి ఇబ్బందులేదని చెప్పారు. ఈ రెండు మూడు రోజులు రైతులెవరు స్లాట్  ను బుక్ చేసుకోవద్దని, వర్షాలు తగ్గిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలని,పత్తిని బాగా ఆరబెట్టి తీసుకురావాలన్నారు. ఒకవేళ వర్షంలో స్లాట్ బుక్ చేసుకుని వస్తే తేమ ఎక్కువగా ఉంటే  తిప్పి పంపే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో రైతులు పూర్తిగా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

అనంతరం జిల్లా కలెక్టర్ మునుగోడు మండలం, కచలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, అమ్మిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని  ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రైతులు కొనుగోలు కేంద్రం వద్దే ఉండి  ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి  ఉంచాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ,కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారి బాలాజీ నింజె, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపి కృష్ణ ,మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.