మొంథా తుఫాన్ ఎఫెక్ట్: కాకినాడ పోర్టుకు డేంజర్ సిగ్నల్ జారీ
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన 'మొంథా' తుఫాను(Cyclone Montha) గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం నుండి వాయువ్య దిశగా కదిలి మంగళవారం ఉదయం 5.30 గంటలకు తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. మొంథా తుఫాను ఆంధ్ర తీరం వైపు కదులుతూనే ఉంది. తీరప్రాంత జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరిక కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓడరేవులకు హెచ్చరికలు జారీ చేసింది.
కాకినాడ ఓడరేవుకు(Kakinada Port) 7వ నంబర్, విశాఖపట్నం, గంగవరం ఓడరేవులకు 6వ నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 5వ నంబర్ ప్రమాద సంకేతం జారీ చేయబడింది. మొంథా తుఫాను మరింత ముందుకు సాగుతుండగా కాకినాడలో సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్ నుండి దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బీచ్ రోడ్లో దాదాపు 8 కిలోమీటర్ల విస్తీర్ణం దెబ్బతింది. ప్రమాదాలు జరగకుండా అధికారులు కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్ను మూసివేశారు.






