మొయినాబాద్లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు
మొయినాబాద్,(విజయక్రాంతి): 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన నాలుగవ దశ ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమం మొయినాబాద్లోని విజెఐఇటి కాలేజ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. అనిల్ కుమార్, అదనపు డీజీపీ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా జి. సుధీర్ బాబు, యోగేష్ గౌతమ్, శివం ఉపాధ్యాయ, ఏసీపీలు చంద్రశేఖర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో సీట్ బెల్ట్ వినియోగించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో రోడ్డు ప్రమాద బాధితులను పాల్గొనింపజేసి వారి అనుభవాలను పంచుకోవడం ద్వారా అవగాహన కల్పించారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయగా, హెవీ వెహికల్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
గోల్డెన్ అవర్ సమయంలో సీపీఆర్ వంటి ప్రాణరక్షణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ జి. సుధీర్ బాబు మాట్లాడుతూ వేగం కంటే ప్రాణం ముఖ్యమని పేర్కొంటూ ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాటించాలని కోరారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలేజ్ మేనేజ్మెంట్, విద్యార్థులు, బస్ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వాహనదారులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






