సిగాచీ ప్రమాద ఘటనలో 39కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాద ఘటనలో(Sigachi Factory Accident) మృతుల సంఖ్య 39కి చేరింది. తీవ్రంగా గాయపడి ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బీమ్ రావు మృతి చెందారు. ధ్రువ ఆస్పత్రిలో చనిపోయిన భీమ్ రావు స్వస్థలం మహారాష్ట్ర. నేడు సిగాచీ పరిశ్రమకు సీఏస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వెళ్లనుంది. ఉన్నత కమిటీ సభ్యులు ప్రమాదస్థలాన్ని పరిశీలించనున్నారు. సీఎస్, రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, ఆరోగ్య శాఖ కార్యదర్శలు ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. నిన్న ప్రమాద స్థలాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. సిగాచీ ఇండస్ట్రీస్(Sigachi Industries Ltd) పాశమైలారంలోని తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరిగి పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సిగాచీ ఫార్మా పరిశ్రమలో శిథిలాల తరలింపు కొనసాగుతుంది. టిప్పర్లలో శిథిలాలను తరలించి ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారు. శిథిలాల్లో కొన్ని శరీర భాగాలు గుర్తించారు. డీఎన్ఏ టెస్ట్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు శరీర భాగాలు పంపించామని, డీఎన్ఏ టెస్ట్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్న అధికారులు వెల్లడించారు.






