30-04-2025 09:02:24 PM
పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షులు బి.నర్సింహరావు..
హనుమకొండ (విజయక్రాంతి): డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలను సకాలంలో నిర్వహించాలని పి.డి.యస్.యు. రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షులు బి.నర్సింహరావు డిమాండ్ చేశారు. బుధవారం కె.యు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రన్ కు పి.డి.ఎస్.యు. బృందం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంపాటి పృథ్వి,బి. నరసింహారావు లు మాట్లాడుతూ... కె.యు. పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరిక్షలు దఫ దఫాలుగా వాయిదా వేయడం జరుగుతుందని, దీని మూలంగా విద్యార్థులకు పీజీ, లా సెట్, బి.ఎడ్ లాంటి అనేక ఎంట్రన్స్ కోర్సులకు పరీక్షలు రాసుకునే అవకాశం లేకుండా పోతున్నదని, దీనితో ఫైనల్ ఇయర్ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.
గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వాలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయని, ప్రభుత్వాల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారు పరీక్షలు నిర్వహించలేమని చేతులెత్తేశారని తెలిపారు. దీని మూలంగా ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల నడుమ విద్యార్థులు నలిగిపోతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపి ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించి డిగ్రీ విద్యార్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.యస్.యు. కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షులు అనూష, గణేష్, సహాయ కార్యదర్శి యాదగిరి, శ్రీజ, సాధన యూనివర్సిటీ నాయకులు చారి, లోకేష్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.