పెద్ద చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత
క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (విజయక్రాంతి) : పీర్జాదిగూడ పెద్ద చెరువు అక్రమణలపై అధికారులు స్పందించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ మేడిపల్లి మండల పరిధిలోని పీర్జాదిగూడ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ‘పెద్ద చెరువుపై వాలిన గద్దలు’ అనే శీర్షికతో బుధవారం కథనం ప్రచురించిన విషయం విధితమే.
స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను గుర్తించి జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. చెరువు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ కూల్చివేతలలో ఎమ్మార్వో హసీనాబేగం, ఇరిగేషన్ ఏఈ పరమేశ్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అలిపాషా పాల్గొన్నారు.




