17-06-2025 04:18:25 PM
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసి 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రల శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సమస్యలు ఉన్నవారు రాజధాని వరకు రాలేరని, కానీ ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించే వాళ్లు ఉండటం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మార్చిలో గరిష్ఠంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందని, ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలియజేశారు. 29 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సాకుకు ఉచిత విద్యుత్ కోసం రూ.11,500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పేదల ఇళ్లకు గృహజ్యోతి కింద 200 యూనిట్లు, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నమని డిప్యూటీ సీఎం వివరించారు.
రైతులకు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, 1,49,35,000 మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా వేస్తున్నామని వ్యాఖ్యానించారు. 9 రోజుల వ్యవధిలోనే రూ.9 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో వేసిన సందర్భాలు గతంలో లేవని తెలిపారు. భూమిలేని పేదలకు కూడా ఇందిరమ్మ భరోసా కింద రూ.12 వేల చొప్పున ఇస్తున్నామని, ఇప్పటికే రేషన్ కార్డులున్న 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.