08-06-2025 08:31:27 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరికీ భూపట్టాలను పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్యా(CPM state committee members Adivaiah) అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశం మాట్లాడారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలి ఇస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్న అటవీ శాఖ అధికారులు దాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఖానాపూర్ ప్రాంతాన్ని కొత్తగా టైగర్ జోన్గా ప్రకటించడం అన్యాయం అని విమర్శించారు. ఈ ప్రకటనతో జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకాలు, రోడ్లు, మంచినీటి బోర్లు, త్రీఫేస్ విద్యుత్ సరఫరా, అంగన్వాడీ, పాఠశాల భవనాల నిర్మాణాలు స్తంభించాయన్నారు. ఇటీవల పట్టాలు ఉన్న భూముల్లో కూడా రైతులకు వ్యవసాయం చేసేందుకు అడ్డంకులు పెడుతున్నారని, 1950కి ముందు మ్యాప్ లను ఆధారంగా చూపి భూములను ఖాళీ చేయించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గిరిజనులు, గిరిజనేతర ప్రజలను ఊర్ల నుంచి తరిమివేయడమే ఈ కుట్రల వెనుక ఉద్దేశమని అన్నారు.
కేంద్రం చేస్తున్న ఈ చర్యలకు కాంగ్రెస్, BRS పార్టీలు మౌనం వహించకుండా ఉద్యమానికి ముందుకు రావాలని సూచించారు. పాత టైగర్ జోన్ను విస్తరింపజేసి కొత్త ప్రాంతాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యాన్ని ఉపయోగించి అటవీ భూములు, ఖనిజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు పులులతో సహజీవనం చేసిన వారేనని గుర్తుచేస్తూ, ఇప్పుడు పులుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు హరివేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యపర్చుకుని విస్తృత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొమ్మెన సురేష్, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంబు, ఫసి ఉద్దీన్, అవర్గ ముత్యం, నాగేల్లి నర్సయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.