ఓడిన సర్పంచుల చేత అభివృద్ధి కార్యక్రమాలా?
మంత్రి జూపల్లి కృష్ణారావుపై సర్పంచ్ల ఆగ్రహం
కొల్లాపూర్ రూరల్, మార్చి 23: ప్రజల చేత పార్టీలకతీతంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లను అవమానపరుస్తూ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, అనుచరుల చేత గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నా చేపట్టారు.
మొలచింతలపల్లి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా సర్పంచులకు సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా సీసీ రోడ్లు వంటి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇండ్ల పథకాల ప్రోసీడింగ్ కాపీలను సర్పంచులకు ఇవ్వకుండా తన అనుచరులకు, ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
ఫలితంగా ప్రభుత్వ ఎంపీడీవో ఎమ్మార్వో కార్యాలయాలకు సర్పంచులు వెళ్ళినప్పుడు అధికారులు తగిన గౌరవం, సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్పంచ్లను అవమానపరిచిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తన వైఖరిని మార్చుకోకపోతే సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.




