పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు శ్రీకారం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల రైతులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది.ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నిరంతర కృషి ఫలితంగా పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు రూ.40 లక్షల నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. నాగిరెడ్డిపేట్ మండల రైతులు పలుమార్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, చెట్లు, మట్టి దిబ్బల కారణంగా సాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని విన్నవించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రత్యేకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ పనుల ద్వారా నాగిరెడ్డిపేట్ మండలం నుండి యెల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామం వరకు సుమారు 58 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలో ఉన్న పిచ్చి మొక్కలు, చెట్లు, మట్టి దిబ్బలు పూర్తిగా తొలగించనున్నారు.
అంతేకాకుండా పోచారం ప్రాజెక్టు పరిధిలోని 78 డిస్ట్రిబ్యూటరీలను మరమ్మతులు చేసి సాగునీరు చివరి ఆయకట్టు భూముల వరకు చేరేలా చర్యలు చేపట్టనున్నారు.ఈ పనులు పూర్తయితే వేలాది ఎకరాల రైతాంగానికి ప్రయోజనం చేకూరడంతో పాటు,చివరి భూమి వరకు సాగునీరు అందుబాటులోకి వచ్చి పంటలకు సమృద్ధిగా నీరు అందనుంది.రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషికి రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






