03-12-2025 12:00:00 AM
రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి
జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్
ములుగు, డిసెంబర్2(విజయక్రాంతి):మేడారం మహా జాతర కోసం వచ్చే భక్తులు ముందుగా జాకారం సమీపంలోని గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించుకుంటారని, ఆ సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను, ట్రాఫిక్ నియంత్రణకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ అన్నారు.
నూతన రహదారుల ఏర్పాట్ల విషయమై, రోడ్డు విస్తరణ పనుల విషయమై అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని, వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్, ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శంకర్ నాయక్, ములుగు సిఐ సురేష్, ములుగు ఎస్ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.