ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి
నిర్మల్,(విజయక్రాంతి): ప్రమాద రహిత సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి(Telangana DGP B. Shivadhar Reddy) అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలో పోలీసు అక్కలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అనంతరం ఎల్లెపెల్లి శివారులో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. పోలీసు అక్కలకు స్కోచ్ అవార్డులు అందించారు. సోన్ మండలంలోని గంజాల్ నేషనల్ హైవే టోల్ ప్లాజా(Ganjal National Highway Toll Plaza) వద్ద లారీ డ్రైవర్లకు హెల్త్ కిట్లు పంపిణీ చేసి సుఖప్రయాణం జరగాలని ఆకాంక్షించారు.
సోన్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుసాడి నృత్యంతో ముఖ్య అతిథులకు ఆదివాసీలు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రమాదాల నివారణ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆ అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఈనెల 18 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్, రాజేష్ మీనా, జిల్లా అధికారులు పాల్గొన్నారు






