16-09-2025 01:10:49 AM
మేడిపల్లి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు, నివాసితులు తమ కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్ మాట్లాడుతూ తమ కాలనీని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదని, ప్రజావాణి లో వినతిపత్రాలు ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని,
ఒక్క సీసీ రోడ్డు వేయ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ అధ్యక్షులు దుండిగల పురుషోత్తం మాట్లాడుతూ కాలనీలో గుంతల మయమైన రోడ్ల కారణంగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బస్సులు రాని పరిస్థితి ఏర్పడిందని, వర్షాకాలం రాగానే కాలనీ రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయని, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి గృహపన్నుల రూపంలో, ఇప్పటివరకు దాదాపు 20కోట్ల రూపాయల వరకు వసూలు చేసినా అభివృద్ధి పనులు ఏమి చేయలేదు అని ఆరోపించారు.
కాలనీ సమస్యలు వెంటనే పరిష్కరించి, అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, వీధి వెలుగులు ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీ వాసులు కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్, కోశాధికారి పసల చెన్నారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లింగాల శ్రీనివాస్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ కారుపోతుల శేఖర్ గౌడ్, మాజీ అధ్యక్షులు దుండిగల పురుషోత్తం, పాలని సభ్యులు దుడుక యాదగిరి, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ నాయక్, చింతం చంద్రశేఖర్, ముసుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.