16-09-2025 01:09:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో డ్రగ్ తయారీ యూనిట్ నడపడంతో అధికారులు ఆదివారం పాఠశాలను సీజ్ చేశారు. ఈ విషయం తెలియని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరుకుని, గేటుకు వేసిన సీల్ను చూసి నిశ్చేష్ఠులయ్యారు. తమ పిల్లల భవితవ్యం ఏమిటంటూ వారు ఆందోళనకు దిగారు.
పాఠశాలను సీజ్ చేసినట్లు యాజమాన్యం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ కనీస సమాచారం లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. చదువు చెప్పాల్సిన బడిలో మత్తుమందులు తయారు చేయడం కంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే 70 శాతం ఫీజులు చెల్లించామని, ఇప్పుడు తమ పిల్లల చదువు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. టీసీలు ఇస్తే తమ పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పించుకుంటామని, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు.