ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ రాహుల్ రాజ్
కౌడిపల్లి, జూన్ 27: జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం చిలప్చెడ్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. తహసీల్దార్ ముసాదిక్, డిప్యూటీ తహసీల్దార్ సింధుజ, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణా లు పెంచాలని కలెక్టర్ అన్నారు. చిలప్చెడ్ జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పిల్లలు చదువులో వెనుకబడినట్లుగా కలెక్టర్ గుర్తించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి నైపుణ్యాలు మెరుగుపర్చాలని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి బడి బయట పిల్లలు ఎవరైనా ఉన్నారా అని విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. డీఈవో రాధాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువుల దుకాణం తనిఖీ..
చిలప్చెడ్ మండలంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ రిజిస్టర్, గోదాంలోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.




