15-11-2025 12:54:03 AM
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
మంచిర్యాల,(విజయక్రాంతి): ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మధుమేహం, రక్తపోట్లను నియంత్రించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య అన్నారు. ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులకు, సిబ్బందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆరోగ్యసిరికి సరైన జీవనశైలి’ అనే నినాదంతో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్యశాఖ తరుపున మధుమేహ నివారణ చికిత్సల గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
పరీక్షలు చేయడం, చికిత్స అందించడం, డయాబెటిస్ వెల్ బీయింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మధుమేహ వ్యాధి శరీర భాగాలను దెబ్బతీస్తుందని, దేశంలో డయాబెటిస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తుందని, నిర్లక్ష్యం చేస్తే కీలకమైన అవయవాలు దెబ్బతింటాయని, చికిత్సతో పాటు నివారించడం ముఖ్యమన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 24,430 మందిలో మధుమేహాన్ని గుర్తించి చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో చేపట్టిన పరీక్షలలో 92 మంది అధికారులు, సిబ్బంది మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేశారు.