07-02-2026 05:52:30 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే రోడ్డు వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు మూడు వారాలు స్టే విధించింది. ఎన్టీఆర్ కాలనీకి ఆనుకొని ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించేందుకు గత కొద్ది నెలల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం బేస్మెంట్ వరకు నిర్మించారు. ప్రహరీ నిర్మిస్తే తమ కాలనీకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని కాలనీ వాసులు విన్నవించారు. రోడ్డు కోసం 20 ఫీట్ల స్థలాన్ని వదిలేసి ప్రహరీ నిర్మించుకోవాలని ఆర్టీసీ అధికారులకు, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు విన్నవించారు.
సమస్య జటిలం కావడంతో అధికారులు కొద్ది రోజులు నిర్మాణ పంజలను నిలిపివేశారు. ఈ మధ్య మళ్లీ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్మాణ సామాగ్రిని తరలించారు. దీంతో కాలనీవాసులు విజయ్ అగర్వాల్ సహకారంతో హైకోర్టులో కొద్దిరోజుల క్రితం కేసు వేశారు. శుక్రవారం రోజున బెంచ్ పైకి రావడంతో వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి మూడు వారాలు స్టే విధించారు. ఎలాంటి నిర్మాణాలు జరపకుండా మూడు వారాలపాటు యథా తదంగా ఉంచాలని, కాలనీ వాసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆర్టీసీ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు స్టే కాపి చేతికి అందేలోపే ప్రహరిని నిర్మించాలని సన్నద్ధం అయ్యారు. బందోబస్తు కోసం పోలీసు అధికారులను సంప్రదించారు. ఇందుకోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు హుటా హుటీనా హైదరాబాద్ నుంచి స్టే కాపి తీసుకొచ్చి ఆర్టీసీ డిఎంకు అందజేశారు. దీంతో ప్రహరి నిర్మాణ పనులను అధికారులు విరమించుకున్నారు. నిర్మాణ పనులను అధికారులు విరమించుకోవడంతో కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తమకు సహకరించిన విజయ అగర్వాల్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.