calender_icon.png 21 June, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణలో వివక్ష

21-06-2025 01:37:43 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా(Kesamudram Baldia) పరిధిలో రోడ్ల విస్తరణలో వివక్ష చూపుతున్నారని, కొన్నిచోట్ల ఎక్కువ విస్తీర్ణం, మరికొన్ని చోట్ల తక్కువ విస్తీర్ణం నిర్ణయించడంతోపాటు పేద ధనిక బేధం చూపుతున్నారని, రోడ్డు విస్తరణ కార్యక్రమం పూర్తిగా పట్టణంలో ఒకే తరహాలో అమలు చేయాలని వివిధ పార్టీల నేతలు, పట్టణ వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు శనివారం కేసముద్రం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి బల్దియ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేసముద్రం బల్దియా లో అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే రోడ్ల విస్తరణ పేరుతో ఒకచోట ఒక్కో తరహా మార్కింగ్ ఇవ్వడం సరి కాదన్నారు. పట్టణం ప్రారంభం నుండి చివరి వరకు ఉన్న రోడ్లను పూర్తిగా ఒకే విధానంలో విస్తరించాలని, పెద్ద చిన్న, ధనిక, పేద బేధం చూపకూడదని పేర్కొన్నారు. బైపాస్ రోడ్డు విస్తరణ తక్కువగా మార్కింగ్ ఇచ్చి, పట్టణ నడిబొడ్డు రోడ్డులో చేపట్టిన రోడ్ల విస్తరణకు ఎక్కువ విస్తీర్ణం మార్కింగ్ ఇవ్వడం వల్ల చాలామందికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రోడ్ల విస్తరణ సమయంలో కూడా కొందరికి మినహాయింపు ఇచ్చారని, ఇప్పుడు అలా కాకుండా అందరి ఆమోదయోగ్యంతో రోడ్ల విస్తరణ చేపట్టాలని, ఎక్కువ మందికి నష్టం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని పేర్కొన్నారు.