07-01-2026 01:21:10 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఊరట కోసం హై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు డ్రగ్స్ పెడ్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా ఇరికించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు ఈ కేసు లో అమన్ ప్రీత్ సింగ్ను పోలీసులు ఏ-7 గా చేర్చారు. విచారణలో అతనికి అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెపుతున్నారు. ప్రస్తు తం అమన్ ప్రీత్ సింగ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అరెస్టు భయంతోనే ఆయన కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. నిందితుల సెల్ఫో న్ల డేటా ఆధారంగా విశ్లేషించగా.. అమన్ ప్రీత్ సింగ్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆరుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
గత నెల 19న హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలోని ఓ మాల్ వద్ద ఈగల్, మాసబ్ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నితిన్ సింఘానియా, షర్నిక్ సంఘీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా 43.7 గ్రాముల కొకైన్, 11.5 గ్రాము ల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా అమన్ ప్రీత్ సింగ్ వ్యవహారం బయటపడింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున, హైకోర్టు తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.