నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జెసిబి అసోసియేషన్ నూతనంగా ప్రవేశపెట్టిన నిబంధనలను ప్రతి యజమాని తప్పకుండా పాటించాలని అసోసియేషన్ నాయకులు ప్రకటించారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఘట్టు మైసమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం గట్టు మైసమ్మ జెసిబి అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిబంధనలకు సంబంధించిన పలు తీర్మానాలు చేశారు. జెసిబి పనులకు ఒక గంట నుండి గంటన్నర వరకు పని చేయించుకుంటే రూ. 3 వేలుగా నిర్ణయించారు.
అలాగే మూడు గంటలు పనులు చేయించుకుంటే గంటకు రూ.4500, ఆరు గంటల నుండి 8 గంటల వరకు పనులు చేయించుకుంటే ఒక గంటకు రూ.12 వందలు, ఒకరోజు మొత్తం పనులు చేయించుకుంటే రూ.5 వేలు, ట్రాక్టర్ చే ఒకరోజు పనులకు రూ.3 వేలుగా నిర్ణయించడం జరిగిందని, నిబంధనలు పాటించని వారు అసోసియేషన్ కు రూ.15 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. చెల్లించనిచో అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న వారి వివరాలు తెలియజేసిన వారికి రూ. 5 వేలు అసోసియేషన్ ద్వారా బహుమతిని అందజేయడం జరుగుతుందని తీర్మానాలు చేశారు.




